Monday, April 11, 2011

lokame kottaga[లోకమే కొత్తగా రివ్యూ ]


కన్నడలో విడుదలై మంచి విజయాన్ని సాదించిన 'మొగ్గిన మనసు' సినిమాను తెలుగులోకి 'లోకమే కొత్తగా' గా రీమేక్ చేసి ఈవారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. నేహ మీడియా బ్యానర్ ఫై భరత్ పారేపల్లి దర్శకత్వంలో నీలంశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శివాజీ, అదితి ఆగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సుమన్, కాశి విశ్వనాధ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. లలిత్ సురేష్ సంగీతాన్ని సమకూర్చగా పెద్దాడ మూర్తి సాహిత్యాన్ని అందించారు. వరస పరాజయాలతో సతమతమువుతున్న దర్శకుడు భరత్ కు, హీరో శివాజీకి తక్షణమే హిట్ కావలసిన పరిస్థితి. విళ్ళిద్దరు 'లోకమే కొత్తగా ' అన్నా తమకు విజయం అందిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశలను ఈ సినిమా ఎంతవరుకు నిలబెట్టిందో మన సమీక్షలో చూద్దాం.

కధ:
కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ లో పాల్గొనటం కోసం బయలుదేరిన అదితి(అదితి ఆగర్వాల్) కాలేజీ రోజులను గుర్తుచేసుకోవటంతో మొదలవుతుంది 'లోకమే కొత్తగా' సినిమా. కాలేజీ తొలినాళ్ళు అందునా యవ్వనపు పరిమళాలు... ఒక్కసారిగా లోకమంతా కొత్తగా కనపడుతుంది. కొన్ని రోజుల పరిచయం తరవాత జ్యోతి అదితికి మంచి స్నేహితురాలవుతుంది. అంతే కాకుండా ఇద్దరు సీనియర్లతో కూడా వారికీ స్నేహం కుదురుతుంది. సినియర్లు బాయ్ ఫ్రెండ్స్ తో తిరగటం చూసి జ్యోతి, అదితి కూడా బాయ్ ఫ్రెండ్స్ గురించి కలలుకంటూ ఉంటారు. తరవాత జ్యోతికి రవితో పరిచయం అవుతుంది. ఆ క్రమంలో ఊహల్లో ఉన్న అదితి ఇంగ్లీష్ లెక్చరర్(సుమన్) ను ఇష్టపడుతుంది. అది ప్రేమకాదు ఆకర్షణ అని తెలుసుకుంటుంది. ఆ తరవాత సంగీతాన్ని ప్రేమించే రాహుల్(శివాజీ) అదితినీ చూసి మనసుపడతాడు. విబిన్నంగా తన ప్రేమను తెలియజేసి అదితి మనసు గెలుచుకుంటాడు. కానీ తన చుట్టూ ఉన్న ముగ్గురు అమ్మాయిలు ప్రేమ మూలంగా ఇబ్బందులు పడటం, రవి మోసం చేశాడని జ్యోతి ఆత్మహత్య చేసుకోవడం అదితికి ప్రేమ మీద నమ్మకాన్ని పోగొడతాయి. దాంతో రాహుల్ ను వదిలి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక ఆ తరవాత తిరిగి అదితికి ప్రేమ మీద నమ్మకం కలిగి రాహుల్ ని ఎలా కలుసుకుంది అనేది మిగిలిన కధ.

విశ్లేషణ: యవ్వనపు తొలినాళ్ళలో అమ్మాయిలలో జరిగే సంఘర్షణలు వాటి పరిణామాలు, ఫలితాలు తదితర అంశాలను చర్చించే ప్రయత్నం 'లోకమే కొత్తగా'.. సినిమాలో చోటుచేసుకున్నాయి. కధ పరంగా సినిమా బాగుంది. కానీ దాన్ని చెప్పిన విధానం నిదానంగా ఉండి ప్రేక్షకులను కుర్చోపెట్టలేదు. స్క్రీన్ ప్లే ను మలిచిన విధానం అస్పష్టంగా లెక్కలేనన్ని ప్రశ్నలకు వేదికగా ఉంది. ఇంటర్ మీడియట్ చదివే పిల్లలు ఎలా ఉంటారో అనే కనీస జ్ఞానం కూడా లేకుండా సినిమా తీసారు. సినిమాలో మాటల కంటే పాటలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఎందుకో వాటివల్ల ఉపయోగం ఏమిటో అర్ధంకాదు. సంగీత దర్శకుడు లలిత సురేష్ చిన్నా చితకా కాకుండా ఏకంగా రెహ్మాన్ ట్యూన్లనే కాపీ కొట్టి మరి వినిపించాడు. ఈ సినిమాకు పనిచేసిన ఏ విభాగం పని తీరు కూడా ఆకట్టుకునే విధంగా లేదు.సినిమాలో శివాజీది ప్రాదాన్యత ఉన్న ప్రాత అనే కంటే అతిధి పాత్ర అంటే బాగుంటుది. ఆ పాత్రలో కూడా ఏమంత గొప్పగా నటించలేదు శివాజీ. అదితి ఆగర్వాల్ కు మంచి పాత్ర లబించింది. నటన పరంగా పర్వాలేదనిపించింది. సుమన్, కాశి విశ్వనాధ్, వైజాగ్ ప్రసాద్ తదితరులు తమ పరిదిమేర బాగానే నటించారు. సుమన్ శెట్టి కామెడీ ఎబ్బెట్టుగా ఉంది.

కొసమెరుపు: ఈ సినిమాలో టైం అన్ని గాయాలను నయం చేస్తుంది అని అంతర్లీనంగా ఓ పాయింట్ ఉంటుంది. అలాగే మన టైం బాగుండాలి అంటే 'లోకమే కొత్తగా..' ఆడుతున్న దియేటర్ల చాయల్లోకి కూడా వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు సినిమా చూసి వస్తున్న ప్రేక్షకులు.

No comments:

Post a Comment